శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు
కృష్ణా పత్రికతో పరిచయం వున్నవారిని శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారెవరంటే ఇట్టే చెపుతారు. వడగళ్ళు రాసినాయనేగా అని. ఆయన 1938లో కృష్ణాపత్రిక సంపాదక వర్గంలో చేరారు. దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పాటు హాస్యం వ్యంగ్యం జత కలిపి " వడగళ్ళు " శీర్షికతో పాఠకులకి వింతా - వినోదం పంచిన ధన్యజీవి.

ఒకటేమిటి - ఆనాటి రాజకీయాలు, అవకతవక ఉపన్యాసాలు, మారుతున్న సాంఘికాచారాలు, నవలోకం కోరుకునే మార్పులు, మతిమరుపు వ్యక్తుల విచిత్ర గాధలు, రాజకీయాలలో రగడలు, సంస్థలలో చెలరేగే దుమారాలు, కవుల కలాలు చిలికే మీగడ తరకలు, ఇలా ఎన్నో తళుకులు మెరిపించేవారు ప్రతి శనివారం విడుదల అయ్యే కృష్ణాపత్రికలోని వడగళ్ళు శీర్షికలో.

అలా రాసిన వాటిలో నుండి కొన్ని వ్యాసాలు వారి అమ్మాయి, జ్ఞానప్రసూనగారు, ఇక్కడ ప్రచురించటానికి అవకాశం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. వారానికి ఒకసారి ప్రచురించే ఆ వడగళ్ళ వానలో ఇక మీరంతా తడిసిపోటానికి తయారైపొమ్మని చెబుతూ...

మీ వంశీ
www.maganti.org